18, ఫిబ్రవరి 2009, బుధవారం

సంక్రాంతి హరిదాసు (సాతాని జియ్యరు )....కృష్ణార్పణం ....


మకర సంక్రాంతి ,తెలుగు లోగిళ్ళ లో అంబరాన్నంటే సంబరాల పెద్ద పండుగ . హరిదాసులు వూరూరా తిరుగుతూ చేసే గాత్ర కచేరి , గంగిరెద్దుల వాళ్ల సన్నాయి రాగాలు , గంగిరెద్దుల పద నాట్యం ,పాదాభివందనం , ,గాలిపటాల ఆకాశ నృత్యాలు , కొత్త చీరెల రెప రెపలు,కొత్త బట్టలు,కొత్త అల్లుళ్ళ సందడి ,అలక పాన్పులు,తీర్చడాలు, బావ మరుదుల ఎక సేక్కాలు , మరదళ్ల పరాచికాలు, ,.....
జల్లల నిండ కూరగాయలు ,గంపల నిండా పిండి వంటలు ,పిల్లలు పోటీ పడుతూ ముంగిట్లో కూర్చొని ,పది మందికి పంచడం ,అరిసెలు, బూరెలు ,గారెలు, పూర్ణాలు,పరవాన్నాలు ,చ క్కిలాలు ,కారప్పూసలు,చేగోడీలు , వాటి ఘుమ ఘుమలు చెరకు తోటల లో బెల్లపు వంటలు, రామ ములగ (tamoto ),వంగ, బీర, తోటలు,పెరళ్ళ నిండా బంతి పూలు,చేమంతి పూలు, సంపెంగలు, దొడ్లో పందిళ్ళ నిండుగా కాసిన ,సొర , చిక్కుడు, పొట్ల పందిళ్ళు,జామ చెట్ల నిండుగా జామ పళ్ళు, దానిమ్మ పళ్ళు ,రామ చిలుకలు కొట్టివేసి క్రింద పడ వేస్తె వాటి కొరకు కొట్లాడుకొనే పిల్లలు, అహో ...ఆ ..అను అనుభూతుల ఆ అనుభవాలు ఎంతెంతని ,ఎంతని చెప్పను,ఎవరికి దక్కును ఆ అనంతానందామృత ఝరులు తెలుగు వానికి దక్క .
హరిదాసు హరినామ గానం తో వుషోదయాన ఆ మేలుకొలుపు .ఇంటి ముంగిట..... కాదు ...కాదు , ప్రక్క ఊరి పొలిమేరల ,....ఆ శబ్ద తరంగాలు ఆ సుదీర తీరాల శబ్దిస్తూ మనలను మేలు కొలుపు తాయి.

ఆ మహాద్భుత హరి నామ స్మరణ,త్యాగయ్యవిరచించిన శ్రీహరి గీతామృత ఆనంద గాన స్రవంతిలో సాగి పోతూ ,, హరి దాసు.... .ఆతని పాట, తంబురా నాదం,గానం ,తన్మయ నృత్యం ......,ఆ మఖర సంక్రమణ వేళ ,సంక్రాంతి నెల పట్టిన వేళ ,లేగ దూడలు చెంగు చెంగున గెంతే వేళ, కోడె దూడల మెడలో గంటలు మ్రోగే వేళ ,రంకెలు వేస్తూ కదలాడే వేళ ,ఇతర పశువుల అంబా రవాలు వినిపించే వేళ,పక్షుల కిలకిలా రవాలు , కావు కావున కాకుల గుంపులు అరిచే వేళ,పొద్దు చుక్క పొడిచిన వేళ ,చలి గణ గణ వణికించే వేళ , కుక్కోరో మని తోలి కోడి కూసే వేళ , రోడ్లు, దొడ్లు వూడ్చే వేళ ,కళ్ళాపి జల్లుల శబ్దాలు వినిపించే వేళ ,ఆ వేకువ తో లేచి ఆవు పేడతో కన్నియలు గొబ్బెమ్మలు చేసి, వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరించే వేళ , ఇళ్ళ ముంగిళ్ళలో రంగవల్లులు అద్దె వేళ ,అలంకరింప బడిన ఆ గొబ్బెమ్మలను రంగవల్లికలలో వుంచే వేళ ......ఆ వుషోదయ నేపద్యంలో మంద్రంగా ,సుదూరంగా వినిపించే అద్భుత నాదం ,అమృత గానం , ఆ చివరి పదం కృష్ణార్పణం .... అతనే హరిదాసు.
హరిదాసు, అందంగా కట్టుకున్నబంగారు జరీ తో కూడిన ఎర్రని పచ్చని పట్టు పంచె పై పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని నడుము చుట్టూ తిప్పి కట్టి,ఆకు పచ్చని పట్టు తల పాగా తలకు చుట్టి , మెడలోబంతి పూల హారంతో , పట్టు వుత్తరీయముతో ,నుదుట హరి నామంతో, భుజాలపైన, వక్షము పైన ,తిరు నామాలతో, భుజాన తుంబుర తో ఒక చేత్తో చిడతలు ,మరో చేత్తో తుంబుర మీటుతూ, శిరస్సు పై , పసుపు కుంకుమలతో,తిరు నామంతోనూ ,పూలతోనూ ,మామిడి ఆకుల తోనూ ,అలంకరించ బడిన ,ప్రత్యెక రీతిలో తయారు చేసిన ,తళ తళ లాడే రాగి పాత్ర శిరస్సు పై నున్న సిరాస్చ్చాదనపై ధరించి,ఆ మాసంలో రోజులు గడిచే కొద్ది ఒక దాని పైన మరొకటిగా పాత్రలు, అలం కర ణలు పెరిగి పోతూ వస్తాయి. ,ఆ పాత్రలు వె డల్పుగా ఎత్తు తక్కువగా వుండి,ఒక దాని కంటే మరొకటి చిన్న దయిన పాత్ర లు, ఒక దాని పై మరొకటి పెంచుతూ ,.నెల చివరికి వచ్చే సరికి నాలుగు అడుగుల ఎత్తున ,పాత్ర పాత్రకి బంతి పూలతో,పుష్పాలంకరణ ,పసుపు,కుంకుమ, తిరు నామాలు మామిడి ఆకులు , వీటన్నింటితో అలంక రించి ,వాటన్నింటిని , తల పయిన స్థిరంగా నిల బెడుతూ ,పడకుండా నియంత్రిస్తూ, సాధన చేస్తూ (ఆ పాత్రలు పెంచే లెక్కల ప్రాతిపదిక ఈ వ్యాస రచయితకు తెలియదు. పాత్రలు పెరుగుతున్నప్పుడు బిక్ష అందుకునేందుకు, తాళం వేసేందుకు ఒక సహాయకుడు వెంట వుంటాడు..) ఒకదానిపై ఒకటి పాత్రలు పెంచుతూ నడచి వస్తుంటే , గాలి గోపురంతో సహా ఆ పాండు రంగడు నడచి వస్తున్నాడా అని తలపించే మహత్తర ఆహార్య ముతో, ......
చేతి చిడతల శబ్దాలతో , చిందులేస్తూ ప్రదక్షణ రీతిలో తిరిగే సమయయంలో వింత వింత గా ధ్వనించే కాళ్ళ గజ్జల రవళి వినిపించే వేళ ,తంబుర నాద తరంగిణిలో మమై క మై ,ఒక పాదం పై బరువు వుంచి మోకాలు నేలకు మోపి వినయంగా కూర్చొని తల వంచి తలపయినున్న పాత్రలో గృహ యజ మానురాలు బిక్ష వేసేటప్పుడు హరి దాసు పలికే పదం 'కృష్ణార్పణం' .

తెలుగింట ప్రతి యింట, సంక్రాంతి మాసాన
హరి దాసు లేనిదే సంక్రాంతి యే లేదు,
గంగిరేద్దె రాని ముంగిలే లేదు
కళ్ళాపి చల్లని లోగిలే కనరాదు
రంగ వల్లిక లేని కళ్ళాపి లేదు,
గొబ్బెమ్మ పెట్టని రంగవల్లిక లేదు ,
గొబ్బెమ్మలే లేని రహదారి లేదు .
యింటి యింటిని కలిపి,
వాడ వాడను కలిపి ,
వూరు వూరును కలుపు ,
అందాల అతివల
హస్తాల వైచిత్రి
అందాల ఆ ముగ్గే
సంక్రాంతి ముగ్గు

నా చిన్న తనాన ప్రతి ఏడూ, విన్న ఆ తంబురా నాదం ఆ త్యాగయ్య పద విరుపులు ,ఆ పలుకు లు .. ..,నెల పట్టిన దగ్గర నుండి ఆ మాసపు ప్రతి రోజూ,దూరంగా ప్రక్క వూళ్ళో పాడుతుంటే ,ఆ పాటలు అలా అలా గాలి అలల పై తేలియాడుతూ అలరించే వేళ, తల విదిల్చిపిల్లలందరం నిద్ర లేచి, కాల క్రుత్యాదులు చేసుకుని , ఆ చలిలో వణుక్కొంటూ, పుల్లలతో చలి మంట చేసుకొని ,ఆ మంటల వేడి లో చలి కాచు కొంటూ .......
హరిదాసు (సాతాని జియ్యరు) కు బిక్ష వేసేందుకు ,నేనంటే నీనని పిల్లలంద రం , కొట్లాడు కొనే వేళ ,
ఆ హరిదాసు (సాతాని జియ్యరు)వస్తే, నేనంటే నేనే ముందని మేమనుకుంటుంటే బాబూ నీవు సగం వేయమ్మా ,పాపా మిగతా నీవు ....కృష్ణార్పణం ......అనే ఆ హరి దాసు....ఆతని పేరేమిటో, వూరేమిటో ఏమీ తెలియదు గాని, ఆ అనుబంధం అంతరించి అర్ధ శతాబ్ది దాటినా
ఇప్పటికి ...ఆ పదం ..కృష్ణార్పణం... శ్రవణా నంద కరం
ఆ ఆహార్యం
ఆ గానం, గాత్రం ,నృత్యం ,
వాద్యం,పలుకు, నడక,
నడత అంతా ,ఆ జ్ఞాపకాల
అలజడులు కంపనలు
నా మస్తిష్కపు ,లోలోతుల ,
నా తనువున కణ కణా న,
నా మది లోపలి పొర పొరలో
పదిలంగా భద్రంగా...
..కృష్ణార్పణం...
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు .తేది:౧౮-౦౨-2009

కామెంట్‌లు లేవు: